*కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కు 73 వినతులు*
పార్వతీపురం, ఫిబ్రవరి 16 : కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 73 వినతులు అందాయి. ఇందులో రెవిన్యూ శాఖకు చెందినవి 25 ఉండగా, 48 వినతులు ఇతర సమస్యలకు పరిష్కారం కోరుతూ వచ్చాయి.
సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్.దిలీప్ చక్రవర్తి, డీఆర్దిఎ పీడీ ఎం సుధారాణి ఇందులో భాగస్వాములై అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు.
*సాధారణ సమస్యలు*
కురుపాం కేటీఆర్ ఒకేషనల్ జూనియర్ కళాశాల నుంచి మీసాల జ్యోతి అర్జీని అందిస్తూ, తనకు రావలసిన తల్లికి వందనం డబ్బులు వేరే ఖాతాలో జమ అయ్యాయని, కావున కాలేజీ వారిని సంప్రదించి ఆ డబ్బును తిరిగి తన ఖాతాకు జమ చేయాలని కోరారు.
పార్వతీపురం మండలం పెదబొండపల్లి ఎస్సీ కాలనీకి చెందిన నత్తల అశ్విత్ అర్జీనందిస్తూ తన తండ్రి మరణించారని, కుటుంబ పోషణ కష్టమై మందులు కొనలేని పరిస్థితుల్లో ఉన్నందున, తనకు సికిల్ సెల్ ఎనిమియా పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
పార్వతీపురం మండలం తాళ్లబురుడి నుంచి సురాపాటి సోములు అర్జీని అందిస్తూ తన బిడ్డలకు బాలికా సంరక్షణ పథకం కింద బాండ్లను జారీచేశారని, అది మెచ్యూర్ అయి నాలుగేళ్లు అయినప్పటికీ, ఇంతవరకు నగదు రాలేదని ఫిర్యాదు చేశారు.
*రెవిన్యూ సమస్యలు*
ఎస్సీ కులానికి చెందిన తన భర్తకు 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం డి-పట్టా కింద మంజూరుచేసిన 2.50 సెంట్ల స్థలం ఆక్రమణకు గురైందని, దానిని తిరిగి ఇప్పించాలని సీతానగరం మండలం లక్ష్మీపురం నుంచి మండంగి సుశీల కోరారు.
పార్వతీపురం నుంచి గరుగుబిల్లి వినయ్ బాబు అర్జీ అందిస్తూ తన తాతకు చెందిన ఎకరా భూమి పంపకాలు చేసుకోవలసి ఉన్నందున, తాత పత్తిక జోగయ్య మరణ ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేయాలని కోరారు
గరుగుబిల్లి మండలం చిలకాం నుంచి దాసరి సత్తమ్మ వినతి పత్రం అందిస్తూ తన తండ్రి మరణానంతరం దాఖలాపడిన భూములను జిరాయితీ భూములుగా తమకు మంజూరు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.







