బస్సు వెనుక టైరు పేలి మంటలు – ప్రయాణికులు సురక్షితం



భువనేశ్వర్ నుండి మల్కాన్ గిరి వెళ్తున్న ఒడిశాకు చెందిన ప్రైవేట్ ఏసీ బస్సు శనివారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతైంది. రామభద్రపురం మండల కేంద్రానికి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం, OD 02 CV 4002 నంబర్ గల శ్రీ నేలకంటేశ్వర ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ ఏసీ బస్సు శుక్రవారం రాత్రి భువనేశ్వర్ నుంచి రాత్రి 7:45 గంటలకు మల్కాన్ గిరి వైపు బయలుదేరింది. శనివారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో రామభద్రపురం సమీపానికి చేరుకున్నప్పుడు బస్సు వెనుక టైరు అకస్మాత్తుగా పేలి మంటలు చెలరేగాయి.
పరిస్థితిని గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సులో ఉన్న మొత్తం 37 మంది ప్రయాణికులను వెంటనే బయటకు దింపాడు. దీంతో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు.
సమాచారం అందుకున్న బాడంగి అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అలాగే సీఐ శ్రీనివాసరావు, ఎస్సై ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి