రాయచోటి రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం*
అమరావతి జూలై 14 :-* అన్నమయ్య జిల్లాలో రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుల్లంపేట మండలం రెడ్డిచెరువు కట్టపై మామిడి లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి 9 మంది మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో 9 మంది చనిపోయారని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. రాజంపేట నుంచి రైల్వే కోడూరుకు వీరు ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు సీఎంకు వివరించారు. మృతులంతా రైల్వేకోడూరు సెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన కూలీలని తెలియడంతో సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చే సమయంలో మృత్యువాత పడటం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్య చికిత్స అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

