ఆల‌యాల ప‌విత్ర‌త‌ను సంర‌క్షిస్తాం
రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌
రామ‌తీర్ధం గిరివ‌ల‌యాన్ని ప్రారంభించిన డిప్యుటీ సిఎం
  రాష్ట్రంలో ఆల‌యాల ప‌విత్ర‌త‌ను సంర‌క్షించేందుకు కృషి చేస్తున్నామ‌ని రాష్ట్ర‌ ఉప‌ముఖ్య‌మంత్రి, పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ది, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖామంత్రి కొణిద‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. రామ‌తీర్ధం నీలాచ‌లం (బోడికొండ‌) చుట్టూ గిరి ప్ర‌ద‌ర్శ‌న కోసం రూ.3.40కోట్ల గ్రామీణ ఉపాధిహామీ నిధుల‌తో 3.7 కిలోమీట‌ర్ల మేర కొత్త‌గా నిర్మించిన గిరివ‌లయం బిటి ర‌హ‌దారిని ప‌వ‌న్ కల్యాణ్ బుధ‌వారం అమ‌రావ‌తినుంచి వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు.

                 ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో చాలా ఆల‌యాల పున‌ర్జీవ‌నానికి కృషి చేస్తున్నామ‌ని అన్నారు. పంచాయితిరాజ్‌, సాస్కి నిధులు సుమారు రూ.40కోట్ల‌తో 22 ప్ర‌ధాన ఆల‌యాల వ‌ద్ద‌ అభివృద్ది ప‌నుల‌ను మంజూరు చేశామ‌న్నారు. రామ‌తీర్ధం గిరి ప్ర‌ద‌ర్శ‌న‌కు వ‌చ్చే భ‌క్తుల ఇబ్బందులు తొల‌గించ‌డానికి రూ.3.40 కోట్ల‌తో ఈ ర‌హ‌దారిని మంజూరు చేశామ‌ని తెలిపారు. ఈ రూపంలో రామునికి సేవ చేసుకొనే భాగ్యం క‌లిగింద‌ని పేర్కొన్నారు. మ‌న సంస్కృతిని ప‌రిర‌క్షించేందుకు, సంప్ర‌దాయాల‌ను కాపాడేందుకు, ఆల‌యాల ప‌విత్ర‌త‌ను ర‌క్షించేందుకు కృషి చేయ‌డం జ‌రుగుతోంద‌ని ప‌వ‌న్ కల్యాణ్ స్ప‌ష్టం చేశారు.

                ఈ కార్య‌క్ర‌మంలో వ‌ర్చ‌వ‌ల్‌గా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర హోంమంత్రి వంగ‌ల‌పూడి అనిత మాట్లాడుతూ ఇదొక గొప్ప కార్య‌క్ర‌మమ‌ని కొనియాడారు. ఇటీవ‌ల కాలంలో గుడికి వెళ్లే భ‌క్తుల సంఖ్య పెరుగుతోంద‌ని, దానికి త‌గ్గ‌ట్టుగా సౌక‌ర్యాల‌ను క‌ల్పించేందుకు కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. ధ‌ర్మాన్ని ర‌క్షిస్తే, అదే త‌మ‌ను ర‌క్షిస్తుంద‌ని తాము న‌మ్ముతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

                 రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి మాట్లాడుతూ, సంక్షేమం, అభివృద్దితోపాటు, ఆధ్యాత్మిక‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ గా రూపొందించేందుకు కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హ‌కారంతో, ఇప్ప‌టికే శ్రీ‌కాళ‌హ‌స్తి ఆల‌యం వ‌ద్ద గిరిప్ర‌ద‌ర్శ‌న కోసం ర‌హ‌దారిని నిర్మించ‌డం జ‌రిగింద‌ని, ఇప్పుడు రామ‌తీర్ధం వ‌ద్ద ప్రారంభించామ‌ని, కోట‌ప్ప‌కొండ వ‌ద్ద  ర‌హ‌దారి నిర్మాణం త్వ‌ర‌లో పూర్తి కానుంద‌ని తెలిపారు. ఆల‌యాల అభివృద్దికి రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌లు ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చాయ‌ని, దీనిపై త్వ‌ర‌లో రాష్ట్ర స్థాయి స‌మావేశం నిర్వ‌హించి, నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. ధూప‌దీప నైవేధ్య ప‌థ‌కం, కామ‌న్ గుడ్ ఫండ్‌, శ్రీ‌వాణి ట్ర‌స్టు నిధుల‌తో రాష్ట్ర‌వ్యాప్తంగా వివిధ ఆల‌యాల అభివృద్దికి, నిర్మాణానికి కృషి చేస్తున్నామ‌ని మంత్రి వివ‌రించారు.

                 రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై సాధికార‌తా సంబంధాల శాఖామంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ మాట్లాడుతూ, ప్ర‌తీ దేవాల‌యాన్ని అభివృద్ది చేయాల‌న్న‌దే త‌మ ప్ర‌భుత్వ లక్ష్య‌మ‌ని పేర్కొన్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 5వేల ఆల‌యాల్లో భ‌జ‌న మండ‌ళ్ల నిర్మాణానికి దేవాదాయ‌శాఖ ద్వారా నిధులు మంజూర‌య్యాయ‌ని చెప్పారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణాన్ని, దైవ భ‌క్తిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామ‌ని అన్నారు. అభివృద్ది, సంక్షేమమే కాకుండా, యువ‌త‌కు మంచి భ‌విత‌ను క‌ల్పించ‌డం, ఉద్యోగాల క‌ల్ప‌న‌కు ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని వ‌ర్చువ‌ల్‌గా మాట్లాడుతూ మంత్రి చెప్పారు.

                ఎంపి క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు మాట్లాడుతూ, జిల్లాలో అభివృద్ది కోసం ప్ర‌జాప్ర‌తినిధులంతా స‌మ‌న్వ‌యంతో కృషి చేస్తున్నామ‌ని, అందులో భాగంగానే ఈ ర‌హ‌దారిని నిర్మించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. రామ‌తీర్ధం అభివృద్దికి త‌న‌వంతు స‌హ‌కారాన్ని అందిస్తామ‌ని చెప్పారు.

                  రామ‌తీర్ధంలో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన అనంత‌రం జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ, రామ‌తీర్ధం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విల‌సిల్లుతుంద‌ని చెప్పారు. ఇక్క‌డ కేవ‌లం హిందూ దేవాల‌య‌మే కాకుండా, భౌద్ద‌, జైన సంస్కృతుల ఆన‌వాళ్లు కూడా ఎన్నో ఉన్నాయ‌ని తెలిపారు. భ‌క్తుల సౌక‌ర్యార్ధం సుమారు 3.40 కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చించి, 3.7 కిలోమీట‌ర్ల మేర ర‌హ‌దారిని నిర్మించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఈ ర‌హ‌దారి అభివృద్ది వ‌ల్ల గిరి ప్ర‌ద‌ర్శ‌న‌కు వ‌చ్చే భ‌క్తుల సంఖ్య భ‌విష్య‌త్తులో మ‌రింత పెరుగుతుంద‌ని అన్నారు.

                  నెల్లిమ‌ర్ల ఎంఎల్ఏ లోకం నాగ‌మాధ‌వి మాట్లాడుతూ, స‌నాత‌న ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షిందుకు ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత‌గానో కృషి చేస్తున్నార‌ని చెప్పారు. రామ‌తీర్ధం అభివృద్దికి మొద‌టి ద‌శ‌లో రూ.3.7 కోట్ల‌తో చేప‌ట్టిన ప్ర‌తిపాద‌న‌ల‌కు ఆమోదం ల‌భించింద తెలిపారు. కోనాడ వేణుగోపాల‌స్వామి ఆల‌య పున‌రుద్ద‌ర‌ణ‌కు రూ.కోటి,25ల‌క్ష‌ల‌తో ప్ర‌తిపాదించామ‌న్నారు. ఆల‌యాల అభివృద్దికి నిధులు మంజూరు చేసిన మంత్రుల‌కు, ఇందుకు స‌హ‌క‌రించిన జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

                 విజ‌య‌న‌గ‌రం ఎంఎల్ఏ పూస‌పాటి అదితి విజ‌య‌ల‌క్ష్మి గ‌జ‌ప‌తిరాజు మాట్లాడుతూ, గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో రామ‌తీర్ధంలో జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌ల‌ను గుర్తు చేశారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే అభివృద్దికి విశేషంగా కృషి చేయ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు.

                బిజెపి జిల్లా అధ్య‌క్షులు రాజేష్‌వ‌ర్మ‌తో బాటు ప‌లువురు కూట‌మి పార్టీల‌ నాయ‌కులు, భ‌క్తులు మాట్లాడుతూ అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో జెడ్‌పి సిఈఓ బివి స‌త్య‌నారాయ‌ణ‌, డ్వామా పిడి శార‌దాదేవి, ఆర్‌డిఓ వెంటేశ్వ‌ర్రావు, మండ‌ల అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి